YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవేళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. హంద్రీ – నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలను సీఎం జగన్ విడుదల చేసి పూజలు నిర్వహించారు. మూడు నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయన రాజకీయంపై జగన్ తూర్పారబట్టారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి ఏమైనా మంచి జరిగిందా..? మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చింది మీ జగన్. కుప్పంను మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పంనకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది మీ జగన్. కుప్పంను పోలీస్ సబ్ డివిజన్ చేసింది మీ జగన్. చిత్తూరు పాల డెయిరీని పునఃప్రారంభించింది మీ జగన్ అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు.
కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హుడేనా? అని ప్రశ్నించారు జగన్. చంద్రబాబు నాడు మంత్రిగా ఉంటూ తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని అన్నారు. ఆ తర్వాత బీసీ నియోజకవర్గాన్ని కబ్జా చేసి 35 ఏళ్లుగా తన డబ్బు ప్రభావంతో కుప్పంలో గెలుస్తూ వచ్చారన్నారు. కనీసం ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని అన్నారు. దీన్ని బట్టే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
సొంత నియోజకవర్గం సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు..75 ఏళ్ల వయసులో నలుగురితో పొత్తు పెట్టుకుని వస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. పొత్తులు దేనికి అంటే సమాధానం చెప్పడని అన్నారు. చంద్రబాబుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను, ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడనీ, కానీ నేను ఏనాడూ కుప్పంను పల్లెత్తు మాట అనలేదన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని కానీ, ఇక్కడి ప్రజలను కూడా ఒక్క మాట అనలేదనీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో రూ.535 కోట్ల వ్యయంతో 1 టీఎంసీ సామర్థ్యంతో రెండు చోట్ల రిజర్వాయర్లు, పాలారు ప్రాజెక్టుకు సంబంధించి రూ.215 కోట్ల వ్యయం, 0.6 టీఎంసీల కెపాసిటీతో మరో రిజర్వాయిర్ నిర్మాణం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే టర్మ్ నాటికి మూడూ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని జగన్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని, కుప్పం ప్రజలు భరత్ ను ఆశీర్వదించాలని సీఎం జగన్ కోరారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకుంటే తన కేబినెట్ లో మంత్రిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. భరత్ తో కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందిస్తానని తెలిపారు. పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా… లేక ఎన్నికలప్పుడు ప్రజలను వాడుకునే చంద్రబాబు మార్కు రాజకీయం కావాలా? అని జగన్ ప్రశ్నించారు.
TTD: రమణ దీక్షితులపై వేటు ..టీటీడీ కీలక నిర్ణయం