TTD: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ పవిత్రతకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించారు.
రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యల వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ ఆయన్ను పదవి నుంచి తొలగించింది. ఆరు రోజుల క్రితం రమణ దీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్లపై నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులు వ్యాఖ్యలపై పాలకమండలి సమావేశంలో చర్చించి ఆయనపై చర్యలకు నిర్ణయించినట్లు చెప్పారు. పాలక మండలి నిర్ణయం మేరకు దీక్షితులును టీటీడీ నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.
తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని రమణ దీక్షితులు ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్ మోహన్రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు మాట్లాడినట్లు వీడియోలో ఉంది. వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదని పేర్కొన్నారు. తిరుమల అధికారులతో తనకు ఉన్న సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికే ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు రమణ దీక్షితులపై పోలీసు కేసు నమోదు అయ్యింది. తాజాగా ఆయనపై టీటీడీ వేటు వేసింది. గతంలోనూ రమణ దీక్షితులు టీటీడీపై చేసిన ట్వీట్ సంచలనం రేపింది. తిరుమల ఆలయంలో సనాతన ధర్మాన్ని పాటించని ఓ అధికారి .. ప్రాచీన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను వ్యవస్థీకృతంగా నాశనం చేస్తున్నారని, దయచేసి ఆలయాన్ని కాపాడాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల సందర్శనకు వచ్చిన సమయంలో ట్వీట్ చేశారు.
Gyanvapi: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు .. వారణాసి కోర్టు తీర్పు సమర్ధించిన హైకోర్టు