CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు (నాయకులు) కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తన సైన్యంగా జగన్ అభివర్ణించారు. 58 నెలలు అలసి పోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు.
లంచం లేని వ్యవస్థ ను అందించడమే వాలంటీర్ల నియామకం అని జగన్ తెలిపారు. లంచాలు, వివక్ష వ్యవస్థను వాలంటీర్లు బద్దలు కొట్టారన్నారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నామన్నారు. 875 మందికి సేవా వజ్ర, 4,150 మందికి సేవా రత్న, 2,50,439 మందికి సేవా మిత్ర అవార్డులను ప్రధానం చేశారు. సేవా వజ్రాలకు రూ.30వేల నుండి రూ.45వేలు, సేవా రత్నలకు రూ.20వేల నుండి రూ.30వేలు, సేవా మిత్రలకు రూ.10వేల నుండి 15వేలకు పెంపు చేసి బహుమతులు అందించామన్నారు.
మన పథకాలకు వాలంటీర్లు బ్రాడ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. చంద్రబాబు హాయంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క అయితే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని అన్నారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం అని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని, టీడీపీని అధికారంలో నుండి దించడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలేనని అన్నారు. 2024లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ అని అయన అన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపు రేఖలనే మార్చాయని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నామంటే అది వాలంటీర్ల వ్యవస్థ గొప్పతనమని అన్నారు. లబ్దిదారుల ఎంపికలోనూ వాలంటీర్ల వ్యవస్థ అమోఘమని, ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఎంపిక చేసి అందరి మన్ననలను అందుకున్నారని ఆయన తెలిపారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.
మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు. గత పాలవనకు, మన పాలనకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలని కోరారు. గత పాలనలో స్కీమ్ లు లేవు, బటన్ లు లేవు, మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని కోరారు. మంచి పౌర సేవలను అందించాలంటే వాలంటీర్ల వ్యవస్థ అవసరమని జగన్ అన్నారు. గౌరవ వేతనంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చిన వాలంటీర్లకు తన సెల్యూట్ అని జగన్ అన్నారు.