అమరావతి: శాసనసభలో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజు పాటు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహార శైలిపైనా ఆరోపణలు చేశారు.
ఉమ్మడి ఏపి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఒక ప్రాజెక్టుకు సంబంధించి తప్పుడు పత్రాలను తీసుకువచ్చి అసెంబ్లీలో మాట్లాడారని జగన్ గుర్తు చేశారు. నాడు చంద్రబాబు తీసుకువచ్చిన తప్పుడు పత్రాలపై అధికార పార్టీ నేతలు కొద్దిసేపు అయోమయానికి గురయ్యారని జగన్ అన్నారు.
మరునాడు ఇదే విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పారని జగన్ గుర్తు చేశారు. అసలు డాక్యుమెంట్ల ఆధారంగా వైఎస్ఆర్ అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు తెచ్చింది తప్పుడు డాక్యుమెంట్లని నిరూపించారని ఆయన చెప్పారు. తాను నకిలీ డాక్యుమెంట్ ఆధారంగా మాట్లాడినట్లు చంద్రబాబు కూడా అసెంబ్లీ వేదికగా ఒప్పుకొన్నారని ఆయన తెలిపారు.
చంద్రబాబు మాదిరిగా అబద్దాలు మాట్లాడకూదని వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. వాస్తవాలనే మాట్లాడాలని ఎమ్మెల్యేలను జగన్ కోరారు.
గత ఐదేళ్లు నడిచినట్లు కాకుండా శాసనసభను భిన్నంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు.