AP High Court: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17వ తేదీన అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సభ జరుపుకోవాలనీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రభుత్వ అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి నుండి తిరుపతికి మహాపాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 17వ తేదీ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అమరావతి జేఏసి నేతలు పోలీసులను అనుమతి కోరగా బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో అమరావతి జేఏసి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి జేఏసి నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం సభకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ల తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణలు ధర్మాసనాన్ని కోరారు.
AP High Court: బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి
అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది సుధాకరరెడ్డి బహిరంగ సభ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు అనుమతి ఇవ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని పేర్కొంటూ వీడియో పుటేజ్ ను ధర్మాసనానికి చూపారు. అదే విధంగా ఒమైక్రాన్ కేసుల ఉన్న నేపథ్యంలో సభకు అనుమతి ఇవ్వవద్దని, అదే విదంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని కోర్టుకు వివరించారు. ప్రవేటు ప్రదేశాల్లో సభను నిర్వహించుకుంటే తప్పేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో రాయలసీమ ఐక్య వేదిక సభను మర్నాడు నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించింది.