రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల పై ఎస్ఈసీ ఏక పక్ష నిర్ణయాన్ని నిరోధించేందుకు జగన్ సర్కార్ దీనిపై అసెంబ్లీ లో తీర్మానం కూడా చేసింది.
దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాయడం మంత్రి కొడాలి నానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మరో సారి నిమ్మగడ్డ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు కొడాలి. నిమ్మగడ్డ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డ రమేష్ కు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్ ను లెక్క చేయని నిమ్మగడ్డ ను ఎన్నికల కమిషనర్ గా తాము గుర్తించమని నాని అన్నారు.2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ అప్పుడు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతూ కూర్చున్నారా అని మండి పడ్డారు.
చంద్రబాబు తానా అంటే తందానా అనే నిమ్మగడ్డ రమేష్ చెప్తే తాము ఎన్నికలు నిర్వహించాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీ అయిన నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు కొడాలి. గతంలో నూ నిమ్మగడ్డ పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలపై నిమ్మగడ్డ గవర్నర్ కు పిర్యాదు చేశారు. కాగా మరో పక్క టీడీపీ నేతలకు కొడాలి సవాల్ విసిరారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో వైసీపీ 90శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు విజయం సాధించకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు కొడాలి. తెలంగాణ లో మాదిరిగా రానున్న రోజుల్లో ఏపీలోనూ టీడీపీ కనుమరుగు అవుతుందని కొడాలి నాని అన్నారు.
గవర్నర్ కు నిమ్మగడ్డ ఏమని లేఖ రాశారంటే..
ప్రభుత్వ సమ్మతి తో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆర్డినెన్సు ప్రభుత్వం నుండి వస్తే తిరస్కరించాలని అవసరమైతే సుప్రీం న్యాయనిపుణులను సంప్రదించాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను నిమ్మగడ్డ కోరారు