Ayyannapatrudu: ఏపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. అయ్యన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం చెందిన వైసీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన వర్గీయులతో ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం మీదకే వెళ్లడం, అక్కడ వైసీపీ, టీడీపీ వర్గీయుల జరిగిన ఘర్షణ, ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. సీఎం వైెఎస్ జగన్ దృష్టిలో పడి మంత్రి పదవి కోసమే జోగి రమేష్ ఈ చర్యకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకూ రాష్ట్రంలో తిరగనివ్వమంటూ జోగి రమేష్ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ జరిగిన ఘటనపై వైసీపీ, టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇది ఇలా ఉంటే.. తీవ్ర వ్యాఖ్యలు చేసి ఈ ఘటనకు కారణమైన అయ్యన్న పాత్రుడు మాత్రం సింపుల్ గా తాను ఎవరినీ దుర్భాషలాడలేదనీ, చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటుంటారనీ.. అదే రీతిలో అవే మాటలను తాను తెలుగులో అన్నానని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు అయ్యన్న. నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్, పౌర సరఫరాల శాల మంత్రి కొడాలి నాని పేర్లను తాను ప్రస్తావించినా ఎక్కడా వారిలా దూషించలేదన్నారు. తన మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయని అయ్యన్న ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకే రక్షణ కరువైంది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా రక్షించబడతాయో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని బహిరంగంగా చెప్పినా బందోబస్తు చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేసే ఏ కార్యక్రమాన్నయినా నిలువరించే పోలీసులు చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.