ఏపీలో టీడీపీ ఏ ముహూర్తాన జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయ్యిందో గాని పార్టీలో చాలా మంది కీలక నేతల సీట్లకే ఎసరు వచ్చేస్తోంది. సీనియర్ నేతలు మాత్రమే కాదు.. చివరకు చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ సీట్లపై కూడా డైలమా ఉందంటే పొత్తు ప్రభావం ఎలాంటి లీడర్లను అయినా ఎలా వణికిస్తుందో తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు, ఇటు లోకేష్కు స్వయానా తోడళ్లుడు అయిన గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ కు ఈ సారి విశాఖ సీటు వస్తుందా ? రాదా అన్న డౌట్ ముందు నుంచి ఉంది.
ఎందుకంటే విశాఖ సీటు నుంచి భరత్ గత ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పైగా జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు భారీగా ఓట్లు వచ్చాయి. ఈ సారి టీడీపీతో పొత్తు ఉంటే విశాఖ నుంచి పోటీ చేయాలని జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే చంద్రబాబు విశాఖ సీటుకు బదులుగా జనసేనకు అదే జిల్లాలోని అనకాపల్లి సీటు ఇస్తామని చెప్పి విశాఖ నుంచి జనసేనను తప్పించారు.
అయితే ఇప్పుడు పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. గతంలో 2014లో పొత్తులో భాగంగా విశాఖ బీజేపీ ఎంపీ సీటు గెలుచుకుంది. అప్పుడు కంభంపాటి హరిబాబు ఏకంగా వైఎస్. విజయలక్ష్మిని ఓడించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ సీటుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నుంచి పోటీకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు సీఎం రమేష్, జీవీఎల్. నరసింహారావు ఏర్పాట్లు చేసుకున్నారు. పురందేశ్వరి గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేశారు.
ఇంత పోటీ మధ్య అసలు విశాఖ సీటు టీడీపీకి వస్తుందా ? అని పెద్ద సస్పెన్స్ నెలకొంది. చివరకు బాలయ్య తన చిన్నల్లుడు కోసం స్వయంగా రంగంలోకి దిగడంతో పాటు చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి తేవడంతో విశాఖ సీటు జనసేన, బీజేపీకి వెళ్లకుండా బాబు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బాలయ్య స్వయంగా రంగంలోకి దిగి.. ఆయన కూడా టెన్షన్ పడి.. ఇటు బాబును టెన్షన్ పెట్టి తన అల్లుడు శ్రీభరత్కు ఎంపీ టిక్కెట్ లైన్ క్లీయర్ చేశారు.