ఏపీ అధికార పార్టీ వైసీపీలో నాయకుల పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు 7 జాబితాలు విడుదల చేశా రు. మార్చిన వారిని మళ్లీ మళ్లీ మార్చి.. మరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. దీంతో ఒక అంకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల్లో ఇక, తమకు తిరుగులేదని అనుకున్న నాయకులకు.. తాడేపల్లి నుంచి అనూహ్యమైన సంకేతాలు వచ్చాయి. మీరు సమన్వయకర్తలే! అంటూ.. సమాచారం అందింది. దీంతో జాబితాల్లో ఉన్నవారు… బేజారైపోతున్నారు.
వైసీపీలో ఇప్పటి వరకు జాబితాలు ప్రకటించినా.. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థులకు అవకాశం ఇచ్చినా.. వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని చెప్పడం లేదు. వారి స్థానాల్లోనూ రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మైలవరం నుంచి తిరుపతిరావు యాదవ్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. కానీ తాజాగా, ఇక్కడ మరో పేరు వినిపిస్తోంది. విజయవాడ ఎంపీ విషయంలోనూ పార్టీ తర్జన బర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు టెన్షన్ కు గురవుతున్నారు.
ఈ పరిణామాలు.. ప్రచారంపై ప్రభావం చూపిస్తున్నాయి. `ఊరికి ముందే.. తీసుకువచ్చి. ఇక్కడ పడేశారు. కానీ, ఏదీ క్లారిటీ లేదు. ప్రచారానికి కదలాలంటే.. రోజుకు 5 లక్షలు అవుతోంది. పోనీ.. ఖర్చు చేసి ప్రచారం చేస్తామా.. లాస్ట్లో ఏం ట్విస్టు ఇస్తారో తెలియదు` అంటూ.. నాయకులు పలువురు ఇదే బాధను వ్యక్త పరుస్తున్నారు. చివరికి క్షణంలో పేర్లు మార్చేస్తారా అని ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులు బెంబేలెత్తుతున్నా.. ఖచ్చితంగా మీరే అభ్యర్థి అని వైసీపీ హైకమాండ్ ఎవరికీ చెప్పడం లేదు.
వైసీపీ అధినేత సీఎం జగన్ ఏడు జాబితాలను రిలీజ్ చేశారు. వారే అభ్యర్థులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, సీఎం జగన్ రిలీజ్ చేస్తోంది అభ్యర్థుల జాబితా కాదు.. కేవలం సమన్వయకర్తల జాబితా మాత్రమేనని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. మార్పు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన వారు.. సీట్ల మార్పిడికి గురైన అసంతృప్త నేతలు `ఇవి సమన్వయకర్తల నియామకం మాత్రమే` అని తేల్చి చెబుతున్నారు. రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చని.. బీఫాం తమకే తప్పక వస్తుందని దీమాగా ఉన్నారు. దీంతో లిస్టులో పేరు ఉన్న వారు కూడా లాస్ట్లో ఏం జరుగుతుందోననే బెంగతో కాలు బయటకు పెట్టడం లేదు.