ఆంధ్రప్రదేశ్లో బిజెపితో పొత్తు తెలుగుదేశం – జనసేన కొంప కొల్లేరు చేస్తుందా ? అంటే తాజా రాజకీయ సమీకరణలు అవుననే చెబుతున్నాయి. బిజెపితో పొత్తు కుదరటానికి ముందు జనసేన – టిడిపి ఏకంగా 120 సీట్లతో అధికారంలోకి వస్తాయి అని చెప్పిన సర్వేలు కూడా ఇప్పుడు టైట్ అయిపోయింది అని చెబుతున్నాయి అంటే బిజెపి పొత్తులో కి ఎంటర్ అయ్యాక టిడిపి – జనసేన పార్టీలకు ఎంత మైనస్ అయిందో క్లియర్ గా కనబడుతోంది. వాస్తవానికి బిజెపికి ఏపీలో ఒక శాతం ఓటింగ్ కూడా లేదు. అయినా చంద్రబాబు కేంద్రంలో ఎన్డీయేతో స్నేహం లేకపోతే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా రాష్ట్రంలో ఏమీ చేయలేమన్న నిర్ణయానికి వచ్చి చాలా రాజీ పడ్డారు.
బిజెపికి ఏకంగా ఐదు పార్లమెంటు ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అవి కూడా తమకు సరిపోవని బిజెపి కండిషన్ పెట్టడంతో చివరకు జనసేన తాను తీసుకున్న అనకాపల్లి పార్లమెంటు సీటుతో పాటు మరో మూడు అసెంబ్లీ స్థానాలు సైతం త్యాగం చేసి బిజెపికి ఇచ్చింది. ఓవరాల్ గా బిజెపికి ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నారు. అయినా కూడా కేంద్రంలో బిజెపి నాయకత్వం టిడిపికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న వాతావరణం అయితే లేదు. చిలకలూరిపేటలో మోడీ ప్రసంగం కూడా జగన్ ప్రభుత్వం పై అంత ఘాటుగా లేదు.
పార్లమెంటు స్థానాలలో అరకు, రాజంపేట, తిరుపతి సీట్లలో బిజెపి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బిజెపి పోటీచేసే పది అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటులో అయినా గెలుస్తుందా ? అంటే సందేహంగానే కనిపిస్తోంది. గతంలో విశాఖ నార్త్లో గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈసారి అక్కడ గలిచే పరిస్థితి లేదు. ఎచ్చెర్ల – పాడేరు – ధర్మవరం – బద్వేలు – జమ్మలమడుగు – విజయవాడ వెస్ట్ లాంటి సీట్లు బిజెపి తీసుకున్న అస్సలు గెలిచే ఛాన్సులు లేవు. కైకలూరులో కామినేని శ్రీనివాస్ కు కాస్త సానుకూలత ఉన్న ఇప్పుడు కామినేనిని కాదని సోమ వీర్రాజు పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ సీటు కూడా కష్టంగా కనిపిస్తోంది.
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు సీట్ల సంగతేమె గాని అసెంబ్లీ సీట్లలో కమలం సింబల్ ఉండి, అటు టీడీపీ , జనసేన సింబల్స్ లేకపోతే ఫ్యాన్ సింబల్కు అయినా ఓట్లేసేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారే కాని కమలం పువ్వుకు ఓటేసేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. అందుకే ఇప్పుడు ఈ ఈక్వేషన్లు చూస్తే ఏపీలో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు లో అయినా గెలవదనే బెట్టింగులు కూడా మొదలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.