తమ కంపెనీపై జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో హెరిటేజ్ కంపెనీ యాజమాన్యం సుప్రీం కోర్టు తలుపు తట్టడానికి సమాయత్తమవుతున్న సంకేతాలిచ్చింది.
గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ కి, ప్రభుత్వ సొమ్ము అకారణంగా దోచి పెట్టారని, హెరిటేజ్ విషయంలోనే రూ.40 కోట్ల అవినీతి జరిగిందని , క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై సిబిఐ ఎంక్వయిరీ చేయించాలని జగన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే దీని పై హెరిటేజ్ పూర్తి వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏపి ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్ళలో మాకు జరిగిన చెల్లింపులే అంత లేవని, మరి 40 కోట్ల అవినీతి అంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని హెరిటేజ్ పేర్కొంది. తమకు గత 5 ఏళ్ళలో ఏపి ప్రభుత్వం నుంచి జరిగిన చెల్లింపులు, రూ.22.68 కోట్లగా పేర్కొంది. 2015 – 2019 మధ్య మజ్జిగ సప్లై చేసినందుకు, ఏపి ప్రభుత్వం చెల్లించింది, రూ.1.49 కోట్లు అని తెలిపింది.
ఇది కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా వచ్చిందేనన్నారు వివిధ గుడిల దగ్గర, బ్రహ్మోత్సవాలకు, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, మొదలగు పండుగల సమయంలో మిగిలిన డైరీలతో పాటు తమకు కూడా ఆర్డర్ ఇచ్చారని, హెరిటేజ్ కి మాత్రమే ఏ కాంట్రాక్టు ఇవ్వలేదని తెలిపింది.
గత 28 ఏళ్ళుగా, నిజాయితీగా, రైతుల సహకారంతో, వినియోగదారుల మద్దతుతో, ఎదిగామని, ఎన్నడు తప్పు చెయ్యలేదని హెరిటేజ్ పేర్కొంది. కావాలని ఇలా కుట్ర చేస్తే, కంపెనీ మీద ఆధారపడి జీవిస్తున్న వివిధ వర్గాల వారు, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడతారని హెరిటేజ్ పేర్కొంది. 28 ఏళ్ళుగా విలువలతో నడుపుతున్న కంపెనీ అని, భవిష్యత్తులో కూడా ఇలాగే నడుపుతాం అని పేర్కొంది.ప్రభుత్వం గనుక కక్షసాధింపు చర్యలకు పాల్పడిన పక్షంలో రైతుల ప్రయోజనాల కోసమైనా న్యాయపోరాటం చేస్తామని కూడా సూచనప్రాయంగా హెరిటేజ్ యాజమాన్యం తెలిపింది.అంటే జగన్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టులో దాఖలవడానికి మరొక కేసు సిద్ధంగా ఉన్న సూచనలు గోచరిస్తున్నాయి.