బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గురించి ఇప్పుడు ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా సేఫ్ గేమ్ పేరిట కంటెస్టెంట్స్ ఆడుతూ పాడుతూ అన్నట్లు ఉండగా మొన్న నాగార్జున వచ్చి ఒకరి మధ్య ఒకరికి పుల్లలు పెట్టేలా చేయడంతో అందరి మధ్యా దూరాలు పెరిగాయి. కంటెస్టెంట్స్ మొత్తం టీమ్స్ గా విడిపోయారు. అయితే ఎవరి టీమ్ లోనూ లేని వ్యక్తి ఒకడున్నాడు. అతనే కుమార్ సాయి.
ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కుమార్ సాయి ఆ తర్వాత అవకాశాలను అందుకోలేకపోయాడు. రెండో వారం మొదట్లోనే వైల్డ్ కార్డ్ పేరిట ఎంట్రీ ఇచ్చాడు కుమార్ సాయి. అయితే ఎంట్రీ ఇచ్చిన రోజు తప్పితే ఇక ఏరోజూ కూడా కుమార్ సాయి మిగతా కంటెస్టెంట్స్ తో సరిగా మాట్లాడింది లేదు. లేదంటే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కుమార్ సాయిని దూరం పెట్టారేమో. మొన్నటి ఆదివారం కూడా కుమార్ సాయి నాగార్జున ముందు ఇదే వాపోయాడు. తనని అందరూ దూరం పెడుతున్నారని, వాళ్లలో ఒకడిలా చూడలేకపోతున్నారని కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేసాడు.
అయితే మూడో వారం నామినేషన్స్ లో కుమార్ ను మిగతా కంటెస్టెంట్స్ ఏ స్థాయిలో టార్గెట్ చేసారో అర్ధమైంది. ఏకంగా కుమార్ కు 8 ఓట్లు రావడం గమనార్హం. అంటే కుమార్ సాయి తప్పించి 16 మంది ఉంటే అందులో సగం మందికి కుమార్ సాయి ఇంట్లో ఉండడం నచ్చలేదు. సెకండ్ సీజన్ లో కౌశల్ హీరో అయింది ఇలానే. అందరూ తనను టార్గెట్ చేయడాన్ని తనకు అవకాశంగా మలుచుకున్నాడు కౌశల్.
అలాగే మూడో సీజన్ లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ ను టార్గెట్ చేద్దామని చూసింది. సీజన్ మొత్తం నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా అని ప్రకటించింది. ఏ బిగ్ బాస్ లో అయినా ఒకర్ని టార్గెట్ చేస్తున్నారు అంటే టార్గెట్ అవుతున్న వాళ్ళ పక్షాన అభిమానులు నిలబడిపోయారు. ఇప్పుడు నాలుగో సీజన్ లో కూడా కుమార్ సాయిను అనవసరంగా టార్గెట్ చేసి ఆడియెన్స్ దృష్టిలో తనను హీరోను చేస్తున్నారు కంటెస్టెంట్స్.