ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది! ఇవి...బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామనీ, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారనీ, తాము కూడా ఆయనను ఆవిధంగానే చూస్తామని సోము వీర్రాజు అన్నారు.
వీర్రాజును సీరియస్గా తీసుకోలేదు కానీ….
మొదట్లో సోము వీర్రాజు మాటలను ఏపీ ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయంటున్నారు. తాజా పరిణాలే దీనికి కారణమని చెప్పుకొస్తున్నారు. కన్నాను తప్పిస్తే కాపులకు దూరం అవుతారన్న ఫీలింగ్తో మళ్లీ కాపులకే ఇవ్వడం ఓ లెక్క. అందుకే పార్టీ తప్ప మరేమీ పట్టని సోము వీర్రాజుకు బీజేపీ రథసారథిగా పట్టం కట్టేశారు. దూకుడిగా ఉండే సోము వీర్రాజు అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చిన తర్వాత కన్నా స్థానాన్ని ఆయనతో భర్తీ చేశారు.
బీజేపీ గూటికి చేరే టీడీపీ నేతలు వీరేనా?
అనుకున్నట్లుగానే ఆయన బీజేపీ తరఫున బలంగా గలం వినిపిస్తున్నారు సోము వీర్రాజు. ఈ కోణంలో బీజేపీలో చేరబోయే నేతలు, అందుకు వారికి గల కారణాలను వీర్రాజు విశ్లేషించారట. ఈ మేరకు కొందరి జాబితాను బీజేపీకి అందించారని టాక్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, పి.నారాయణ తదితరులకు సంబంధించిన లెక్కలు తీసి బీజేపీ రెడీ పెట్టుకుందట. త్వరలోనే వీరు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
వీర్రాజు అసలు మైండ్ గేమ్ ఇది
మరోవైపు ఈ నేతలకు సంబంధించిన లెక్కలే కాకుండా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో జరిగిన ప్రచారం సైతం కన్నా దూకుడుగా మారడానికి ఓ కారణమని అంటున్నారు. టీడీపీకి బీజేపీని తోక పార్టీలా మార్చేశారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వైసీపీ మీదకు ఏ స్థాయిలో దూకుడుగా వెళ్లారో.. వైసీపీ కూడా అదే దూకుడుగా కన్నా మీదకు వెళ్లింది. అయితే, ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయడం కంటే ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిస్తే ఆ తర్వాత ఎన్నికల సమీపంలో బీజేపీని బలమైన ప్రత్యర్థిగా తీర్చిదిద్దడం, అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించడం సులభం అవుతుందని బీజేపీ ముఖ్యులు భావిస్తున్నట్లు టాక్.