(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్: ప్రతినిధి)
తెలంగాణ బీజెపీ అధ్యక్షుడుగా ఎంపి బండి సంజయ్ నియమితులు అయినప్పటి నుండి గతంలో కంటే భిన్నంగా అధికార టీఆర్ఎస్పై దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బండి నేతృత్వంలోని బీజేపీ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు బీజేపీకి మంచి జోష్ ఇచ్చింది. అధికార టీఆర్ఎస్కు కంచుకోట లాంటి సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ సీటును బీజేపీ కైవశం చేసుకోవడంతో వివిధ రాజకీయ పార్టీల్లోని అసంతృప్తి నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో సత్తాకై వ్యూహాలు
దుబ్బాక ఎన్నికల విజయం జోష్తో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో భాగంగా టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ నేతలు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బీజేపీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంకై కృషి చేస్తున్నది. డివిజన్ స్థాయి సమావేశాలలోనూ బండి సంజయ్ పాల్గొంటూ కేడర్లో ఉత్సాహాన్ని కల్గిస్తున్నారు. పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పేస్తున్నారు.
కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ నేతలకు గాలం
కాంగ్రెస్ పార్టీ నుండే కాక టీఆర్ఎస్ పార్టీ నుండి నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనుకునే వారు, టీఆర్ఎస్ లో ఎదిగే అవకాశం లేదని భావించే వారు బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. డివిజన్ స్థాయి నేతలతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో వివిధ రాజకీయ పార్టీల నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉండి పేరు ఉన్న నేతలకు బీజేపీ నేతలే గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి చేరిక దాదాపు ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండే సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. విజయశాంతితో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి మంతనాలు జరపగా, అద్దంకి దయాకర్తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి మధ్యవర్తిత్వంతో బండి సంజయ్ ఇప్పటికే శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారని కూడా సమాచారం. గతంలోనే శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరతాని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల బయటకు రాలేకపోయారని సమాచారం. బండి సంజయ్ ఇప్పుడు మరల శ్రీనివాసరెడ్డితో మంతనాలు జరపడంతో చేరికకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో కమలం, కారు మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.