ఊహించని స్థాయిలో 151 సీట్లు సంపాదించడంతో పాటు, మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి కొడుకును దిమ్మతిరిగే దెబ్బకొట్టడంతో కలిపి.. గత అధికారపక్షానికి 23 సీట్లు మాత్రమే మిగిల్చింది వైకాపా. ఆ ఫలితాలిచ్చిన ఉత్సాహమో ఏమో కానీ… ప్రస్తుతం చంద్రబాబు నియోజకవర్గం పై దృష్టి పెట్టిందంట. ఇందులో భాగంగా ప్రస్తుతం వైకాపాలో సీమకు చెందిన పెద్ద తలకాయలు అక్కడే పాగా వేసి మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే కుప్పం నియోజకవర్గానికి సంబందించిన కొందరు బలమైన నేతలకు కండువాలు కప్పేసింది వైకాపా. ఎన్నడూ లేనివిధంగా గత ఎన్నికల్లో బాబుకు మెజారిటీ తగ్గడమే కాకుండా.. ఒకటి రెండు రౌడ్లలో వెనకబడిపోయారు కూడా. ఈ లెక్కన చూసుకుంటే కాస్త మనసుపెట్టి గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పాన్ని కూడా కొట్టొచ్చనే దిశగా వైకాపా సీరియస్ గా పనులు చేసుకుంటూ పోతుందట. దీంతో బాబు కుప్పంపై పర్యవేక్షణలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా.. ఎప్పుడూ కుప్పం గురించి ఆలోచించని చంద్రబాబు తాజాగా కుప్పంనియోజకవర్గం గురించి తెగ ఆరాలు తీస్తున్నారు. అంతే కాకుండా.. అక్కడి సమస్యలపై కూడా మైకులముందుకు వస్తున్నారు. ఇటీవల హంద్రీ, నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన కుప్పం కాల్వల పురోగతిపై సమీక్షించిన ఆయన.. ప్రభుత్వం కాలవ పనులను ఆపేసిందని ఆరోపించారు.
ఇదే క్రమంలో కార్యకర్తలు కూడా ఐకమత్యంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని, తాను కూడా ఇకపై రెగ్యులర్ గా కుప్పం నియోజకవర్గానికి టచ్ లో ఉంటానని, కుప్పం నుంచి వస్తే చాలు తనను దాదాపు నేరుగా కలిసే అవకాశం ఉండొచ్చని కూడా చెబుతున్నారంట. ప్రస్తుతం వైకాపా చేస్తున్న కుప్పం ఆపరేషన్ బాబును ఆ రేంజ్ లో టెన్షన్ పెడుతుందన్న మాట!!