వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రం ఎక్కి తీరాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగుతోంది. అధికార పార్టీ వ్యూహాలకు అదిరిపోయే వ్యూహాలు వేస్తూ.. బలమైన నాయకులను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో కీలకమైన గుంటూరు నియోజకవర్గానికి అబ్యర్థిని ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు పార్లమెంటు స్థానం టీడీపీకి అత్యంత కీలకం. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీనే గెలు చుకుంది. బలమైన నాయకుడిగా.. మంచి వాక్చాతుర్యం.. ఉన్న నేతగా ఇక్కడ నుంచి గెలిచిన గల్లా జయదేవ్ గుర్తింపు పొందారు. ఆయన ఇక్కడి సమస్యలపైనా పోరాటం చేశారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంపై గళం వినిపించారు. ఫలితంగా.. ఈ నియోజకవర్గం పరిధిలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. టీడీపీకి మంచి పేరు వచ్చింది.
పైగా రాజధాని అమరావతి విస్తరించి ఉన్న తాడికొండ, మంగళగిరి ఈ రెండు సెగ్మెంట్లు కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి సాక్షాత్తూ చంద్రబాబు తనయుడు అప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ ఓడిపోయారు. ఎంతో అభివృద్ధి చేసి రాజధాని ఇచ్చినా కూడా తాడికొండ, మంగళగిరి సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఈ సారి ఈ రెండు సీట్లలో భారీ మార్పు ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఈ సారి గుంటూరు పార్లమెంటు అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీకి ప్రెస్టేజ్ సీటుగా మారింది.
సిట్టింగ్ ఎంపీ జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. బలమైన ఈ సెగ్మెంట్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, గల్లా.. రాజకీ యాలకు దూరం కావడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. వైసీపీ ధాటిని తట్టుకుని నిలబడి.. సెగ్మెం ట్లో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నారై నాయకుడు, పార్టీకి ఎప్పటి నుంచో విధేయుడిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ టికెట్టు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన 2014లో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు.
అయితే.. గత ఎన్నికలకు ముందు.. గత ఎన్నికల్లోనూ టీడీపీ అవకాశం ఇవ్వలేక పోయింది. కానీ, ఆయన మాత్రం పార్టీకి అండగా ఉన్నారు. ఏ అవసరం వచ్చినా.. పార్టీకి సహకరిస్తున్నారు. ఇటీవల చంద్రబాబుపై కేసులు నమోదైనప్పుడు కూడా చంద్రశేఖర్ అమెరికాలో టీడీపీ ఎన్నారై విభాగం చేపట్టిన ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. బలమైన నాయకుడిగా, అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా కూడా పెమ్మసాని గుర్తింపు పొందారు. తాజాగా ఆయన ఏపీకి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయన గుంటూరు పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేయొచ్చని అంటున్నారు.