బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో మోడీ గ్యారెంటీ పేరుతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదెలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇది కూడా మోడీ గ్యారెంటీగానే రాజకీయ నేతలు భావిస్తున్నారు. సుదీర్ఘ సమయం వేచి చూడడం, ఓపికగా, ఓర్పుగా కూడా పొత్తుల కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్.. ఒక సందర్భంలో తన మనసులోని మాటలను కూడా బయట పెట్టేశారు. `పొత్తుల కోసం ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లానో తెలుసా? ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? ఎన్ని సార్లు తిట్టించుకున్నానో తెలుసా?` అని వ్యాఖ్యానించారు.
అంటే.. మొత్తానికి ఇప్పుడు కుదిరిన పొత్తు అంత తేలిక అయితే కాదు. పైగా బీజేపీ కూడా కేంద్ర స్థాయిలో చూసుకుంటే.. తన మిత్రపక్షాలను చేజార్చుకోవడం లేదు. మిత్రపక్షాలు చేజారితే.. దుందుడుకుగా వ్యవహరిస్తే.. అది మోడీ పాలనకు, ఆయన రాజకీయాలకు కూడా మచ్చగా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమతో ముమ్మాటికీ కలిసి సుదీర్ఘకాలం ముందు కు సాగాలని కోరుకునే పార్టీలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నించడం.. తద్వారా శూల శోధన చేసి మరీ.. బీజేపీ చేతులుకలపడం గమనార్హం.
అంటే.. బీజేపీ వ్యూహం ప్రకారం.. టీడీపీతో కలిసి సుదీర్ఘ కాలం ముందుకు సాగాలని.. తమతోనే ఉండాలనే వ్యూహంతో ఉంది. దీనికి చంద్రబాబు కూడా తలూపారని డిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ కాలంలో మూడు సార్లు పొత్తులు పెట్టుకుని.. నాలుగు సార్లు విడిపోయిన పరిస్థితి చంద్రబాబు హయాంలోనే జరిగింది.ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తమను ఓటమి బాట పట్టించిందనే అభిప్రాయం కూడా తమ్ముళ్లకు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ పొత్తులను సుదీర్ఘకాలం ముందుకు తీసుకువెళ్లడం ఖాయమని తెలుస్తోంది.
అంతేకాదు.. ఎలాంటి ఒత్తిడి వచ్చినా..ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. బీజేపీతోనే కలిసి ముందుకు సాగేలా చంద్రబాబు నిర్ణ యించుకున్నారని సమాచారం. అందుకే.. టీడీపీ-బీజేపీతో పొత్తును దీర్ఘకాలం కొనసాగిస్తుందనే అంచనాలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీ రెచ్చగొట్టడం.. ప్రత్యేక హోదా వంటి విషయంలో చంద్రబాబు వేసిన తప్పటడుగులువంటివి బీజేపీకి దూరం పెంచాయి. ఇప్పుడు.. అలాంటి పొరపాట్లకు తావులేకుండా.. చంద్రబాబు బీజేపీతో తన బంధాన్ని ద్రుఢతరం చేసుకునేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.