Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అదినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత 45 రోజులుగా చంద్రబాబు కారాగార వాసంలో ఉన్నారు. ఇటీవల ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వర్చువల్ గా చంద్రబాబును హజరు పర్చిన సమయంలో పలు విషయాలను చంద్రబాబు తన ఆరోగ్యం, భద్రత విషయంపై ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. దీంతో చంద్రబాబు తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాశారు. ఈ నెల 25వ తేదీన రాసిన లేఖను జైల్ అధికారుల ద్వారా న్యాయమూర్తికి పంపారు.
ఈ లేఖలో పలు కీలక అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని.. దిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. తాను జైలుకు వచ్చిన సమయంలో అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీశారని, ఆ పుటేజీని పోలీసులే లీక్ చేశారని పేర్కొన్నారు చంద్రబాబు. తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో పుటేజీని రిలీజ్ చేశారని, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యయన్నారు. వామపక్ష తీవ్రవాదులు తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని అజ్ఞాత లేఖ ఎస్పీకి వచ్చిందనీ, తనను హత్య చేసేందుకు కోట్లు చేతులు మారినట్లు తెలిసిందన్నారు. అజ్ఞాత లేఖపై పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదని, అనుకోని ఘటన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు.
జైలులో శృంగవరపు కోటకు చెందిన డ్రగ్స్ కేసు నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతున్నాడనీ, ఆ ఖైదీ జైలు లోపల ఫోటోలు తీస్తున్నాడని అన్నారు. ఈ నెల 6వ తేదీన జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారని, తన కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్ వాడారని పేర్కొన్నారు. ములాఖత్ లో తనను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్ ఎగురవేశారన్నారు. తన తో పాటు తన కుటుంబ సభ్యులకూ ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైసీపీ వారే అన్న అనుమానం ఉందని, ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. డ్రోన్ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదన్నారు. ఇది జైలు అధికారుల నిస్సహాయతకు నిదర్శమన్నారు.
కొందరు గంజాయి ప్కాకెట్లు జైలులోకి విసిరారనీ, గార్డెనింగ్ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారని అన్నారు. జైలులో మొత్తం 2,200 మంది ఖైదీలు ఉండగా, వారిలో 750 మంది డ్రగ్స్ కేసు నిందితులు ఉన్నట్లు తెలిపారు. ఖైదీల వల్ల తన భద్రత కు తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. 2019 జూన్ 25న తన సెక్యూరిటీ తగ్గించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. 2022 నవంబర్ 4న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిందనీ, ఆ తర్వాత 2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరో సారి రాళ్ల దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
Telangana Assembly Polls: బీజేపీ రెండో జాబితా విడుదల .. ఆశావహుల్లో నిట్టూర్పు..ఎందుకంటే..?