ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ పరిపాలనలో ఆయన మార్కు చూపిస్తున్నారు. ప్రజల కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ చేపట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. ఇదే విధంగా సీఎం జగన్ తీసుకున్న మరో సంచలనాత్మక నిర్ణయం వార్తల్లో నిలుస్తోంది. స్కూలు పిల్లల్లో.. తామంతా ఒకటే అనే భావన తీసుకొచ్చేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
పాఠశాల స్థాయి నుంచే అమలు..
విద్యార్ధుల స్థాయిలో బేధాలు ఉండకూడదనే యూనిఫాం నిబంధన ఉంది. అయితే.. రికార్డుల్లో మాత్రం పిల్లల మతం, కులం ప్రస్తావన లేకుండా ఏ ప్రభుత్వమూ నిర్ణయం తీసుకోలేదు. కానీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాల రిజిస్టర్ లో విద్యార్ధుల కులం – మతం వివరాలు కనిపించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై రిజిస్టర్ లో విద్యార్ధుల కులం, మతం కనిపించవు. అంతేకాదు.. విద్యార్ధుల హాజరలో బాలికల పేర్లు ఎర్ర సిరాతో రాసే విధానానికి కూడా స్వస్తి పలికింది. దీంతో విద్యార్ధుల దశలోనే వారిలో కుల, మతాల భావన రాకూడదనే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
జగన్ దూకుడుకు నిదర్శనం..
జగన్ సీఎం అయిన వెంటనే తీసుకున్న నిర్ణయాల్లో పాఠశాలల ఆధునీకరణ అంశం ఒకటి. నాడు నేడు కింద ప్రస్తుత పాఠశాల ఫొటో అభివృద్ధి చేసిన తర్వాత ఫొటోతో కలిపి చూపాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు. పాఠశాలల గోడలపై చిన్నారులను ఆకర్షించే చిత్రాలు, రంగులు, బెంచీల మార్పు, మంచి నీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తిగా వ్యవస్థనే మార్చేశారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయాలకు విశేష స్పందన లభిస్తోంది. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా సీఎం జగన్ సఫలమయ్యారనే చెప్పాలి.