పోలీసుల కారణంగా చీరాలలో అనుమానాస్పదంగా మరణించిన కిరణ్ కుటుంబం విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఘటన జరిగిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న జగన్ ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయంగా రూ. పది లక్షలు ప్రకటించారు. ఈ సాయాన్ని కొద్ది రోజుల కిందటే ఆమంచి సహా, జిల్లా సంయుక్త కలెక్టర్ ఆ కుటుంబాన్ని కలిసి అందించారు. దీనిపై మరింతగా దృష్టి పెట్టిన సీఎం తాజాగా ఈ ఘటన జరిగిన చీరాలకు ప్రభుత్వ ప్రతినిధులను పంపించారు. జగన్ ఆదేశాల మేరకు ఎస్సి (మాల) కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ.., తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చీరాల వచ్చారు. నియోజకవర్గ ఇంచార్జి ఆమంచిని కలిసి ఘటన పూర్తి వివారాలను తెలుకున్నారు.
కుటుంబానికి పరామర్శ.., సాయంపై ఆరా…!!
ఈ బృందం కిరణ్ ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అందిన సాయంపై ఆరా తీశారు. కుటుంబ పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇక ముందు కూడా మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.., ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని, బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, మీ కుటుంబానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని చెప్పారు.