తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో వివాదం నడుస్తోన్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలు పరిష్కరించడం కోసం అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు.
వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కేసీఆర్, వైఎస్ జగన్ ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ భేటీలో పాటించాల్సిన వ్యూహంపై కేసీఆర్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవ్వనున్నారు. ఏపీ నదీ జలాల విషయంలో కావాలనే పేచీ పెడుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ వాదనలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ధీటైన జవాబు చెప్పాలని, మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అన్నారు.