Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ అవుట్ పోస్టు లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం వేకువజామున చోటుచేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్ పోస్ట్ కు సమీపంలో పేలడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
లోక్ సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్ మణిపూర్ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. నరన్ సైనా ప్రాంతంలో ఓటింగ్ విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది నిన్న రాత్రి ఇక్కడి ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంప్ వద్ద బస చేశారు. అయితే అర్థరాత్రి దాటిన తర్వాత వీరిపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండల ప్రాంతం నుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన కాల్పులు దాదాపు రెండున్నర గంటల వరకూ సాగాయి. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్ పెక్టర్ శంకర్, హెడ్ కానిస్టేబుల్ అనుప్ సైనీ మరణించినట్లుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం