ఒక చిన్న సినిమా మొదలు పెడితేనే దర్శక నిర్మాతలు చాలా టెన్షన్ పడుతుంటారు. 5 కోట్ల బడ్జెత్ తో నిర్మిస్తున్న సినిమా విషయంలోనే అనుకున్న షెడ్యూల్ కంటే 15-20 రోజులు ఎక్కువ అయితేనే మేకర్స్ అల్లాడిపోతుంటారు. ఇక ప్రకటించిన డేట్ కి రిలీజ్ చేయలేక ఓ రెండు నెలలు పోస్ట్ పోన్ అయితే తెచ్చిన వడ్డీలు డబుల్ అవుతాయని నిర్మాతకి రాత్రిళ్ళు నిద్ర పట్టక పడే అవస్థలు ఎన్నో. అలాంటిది భారీ బడ్జెట్ సినిమా. పాన్ ఇండియన్ కథ.. స్టార్ హీరోలు… దర్శక దిగ్గజం.. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే ప్రాజెక్ట్ అంటే ఇక మేకర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది.
కరోనా మొదలయ్యాక ఆర్ ఆర్ ఆర్ గురించి ఇండస్ట్రీలోనే కాదు.. దేశం మొత్తం మాట్లాడుకుంది ఈ విషయాలనే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పోరాట యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తోంది. బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తుంది. ఇక అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫిక్షన్ కథాంశానికి రాజమౌళి తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా అనుకున్నదానికంటే సంవత్సరం ఆలస్యంగా రిలీజ్ చేయబోతున్నారు.
కాగా ఈ సినిమా విషయంలో బయట నుంచి వినిపిస్తున్న మాటలకి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఏ సినిమాకైనా ఇబ్బందులు ఎదురవుతాయని .. ఈ సినిమాకి కాస్త ఎక్కువగా ఎదురయ్యాయని.. అది కూడా కరోనా వల్ల .. అయినా నేనేమి తల బద్దలు కొట్టుకోవడం లేదు. పక్కా ప్లాన్ తో అనుకున్న సమయానికే ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. కాగా 2021 సమ్మర్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రాంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.