నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. రఘురామ కృష్ణంరాజు కలకలం రేపే వ్యాఖ్యలు, పార్టీ షోకాజ్ నోటీసుకు
ఆయన ఇచ్చిన పొంతనలేని సమాధానం, ఆయన వ్యవహారశైలి, ఇలా అన్నింటిపై సీరియస్గా ఉన్న వైసీపీ అధిష్టానం చివరకు వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయడం…అయినప్పటికీ ఆయన తన వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం తెలిసిన సంగతే. తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు.
తాజాగా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరిన్ని కలకలం రేపే కామెంట్లు చేశారు. న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురవుతున్నాయన్న ఆయన ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పార్క్ హయత్లో హోటల్ ఏదో జరిగిందంటూ విజయ సాయిరెడ్డి పెట్టిన “ట్వీట్” ఫోన్ టాపింగ్ జరిగింది అనేందుకు నిదర్శనమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఫోన్ టాపింగ్ జరగకపోతే “ఫేస్ టైం”లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయిరెడ్డికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ తన చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టాలని సూచించారు.
న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నారన్న అప్రతిష్ట తెచ్చుకోకండని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేదించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నేతలకు హితవు పలికారు. టెలిఫోన్ టాపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశం నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఇదిలాఉండగా, ఒకరోజులోనే రఘురామ కృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కలకలం రేపే కామెంట్లు చేశారు. సీఎంకు తెలిసి జరగకపోయినా ఆయన అభిమానం సంపాదించడానికి కొంతమంది అధికారులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. `సీఎం గారు మీకు తెలియకుండా మీ కోటరిలోని అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారు… కోర్టులు శిక్షించకముందే ప్రభుత్వమే విచారణ జరిపి శిక్షించాలిని` అని సూచించారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామరాజు ఏకంగా ప్రభుత్వం కుప్పకూలనుందనే కామెంట్ల వెనుక మర్మం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.