Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రచార హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్ధుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్ పై ప్రచురణ కర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో ప్రచురణ కర్తల పేరు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అదే విధంగా ఎన్నికల సంబంధిత సామాగిర్, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్ లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంథు అదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చండక్ తెలిపారు.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రకటనలను ముందుగానే సర్టిఫికేషన్ చేయించుకోవాలని ఈసీ అధికారులు సూచించారు. ప్రజా ప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రచారంలో సంబంధం ఉన్న కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లకార్డులు, బ్యానర్లపై ప్రచురణ కర్త పేరు లేకుండా ముద్రించడానికి వీలులేదని తెలిపారు.
YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆ కీలక నేతలు..ఎవరెవరు..? ఎందుకు..?