YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిక్కెట్ లు దక్కని నేతలు వారి పార్టీలను వీడి పక్క పార్టీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీలో టిక్కెట్ లు ఆశించి భంగపడిన నేతలు వారి ఆనుచరులతో ఇవేళ వైసీపీలో చేరారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన మాజీ జనసేన నాయకుడు పోతిన మహేష్, పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, రాయచోటి టీడీపీ మాజీ ఇన్ చార్జి ఆర్ రమేష్ రెడ్డి లు ఇవేళ సీఎ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారి వారి అనుచరులతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, సీఎం వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పోతిన మహేష్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ దాదాపు 22వేలకుపైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. నాడు కేవలం 7వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతోనే టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపొందారు. దీంతో ఈ సారి కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న అంచనాతో ఉన్న పోతిన మహేష్ .. జనసేన టిక్కెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు.
అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో పోతిన మహేష్ వర్గీయులు కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేసినప్పటికీ జనసేన అధిష్టానం పట్టించుకోకపోవడంతో రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇవేళ తన అనుచరులతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
అలాగే 2019 ఎన్నికల్లో పీ గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన పాముల రాజేశ్వరికి ఈసారి పార్టీ అధిష్టానం టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పాముల రాజేశ్వరి 2004 ఎన్నికల్లో నగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలి సారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన పి గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి మరో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రాజేశ్వరి 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఏడాదిలోనే ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. 2019లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి దాదాపు 36వేలకుపైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన నుండి ఆమెకు టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీని వీడి తిరిగి వైసీపీ గూటికి చేరారు.
ఇక రాయచోటికి చెందిన టీడీపీ ఇన్ చార్జి ఆర్ రమేష్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వైసీపీ అభ్యర్ధి గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతిలో భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. ఈ సారి కూడా టీడీపీ టిక్కెట్ ఆశించగా, టీడీపీ అధిష్టానం ఆయనకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన మందిపల్లి రాంప్రతాప్ రెడ్డికి టిక్కెట్ కేటాయించడంతో రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. టీడీపీకి రాజీనామా చేసిన రమేష్ రెడ్డి ఇవేళ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
America: అమెరికాలో కిడ్నాప్ కు గురైన హైదరాబాదీ విద్యార్ధి మృతి