Shiv Sena MP Sanjay Raut: శివసేన సీనియర్ నేత, ఎంపి సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది. రూ.1,043 కోట్ల విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన అలిబాగ్లోని ఎనిమిది భూములు, ముంబయి చాదర్లోని ఓ ప్లాట్ ను సీజ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పాత్రచాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి మహారాష్ట్ర కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్ ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈడీ అరెస్టు చేసింది, అనంతరం చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. పీఎంసీ బ్యాంకు మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ను గత ఏడాది ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు వీరికి చెందిన రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.
Shiv Sena MP Sanjay Raut: పోరాటం చేసి అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేస్తా
ఈ సందర్భంగా ఈడీ చర్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తిలేదని సంజయ్ రౌత్ అన్నారు. తన ఆస్తులను సీజ్ చేసినా, జైలుకు పంపినా, తుపాకీతో కాల్చినా భయపడే వాడిని కాదన్నారు. తాను బాలాసాబెహ్ ఠాక్రే ఫాలోవర్ను, శివ సైనికుడిని అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనిపై పోరాటం చేసి అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేస్తానని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నారు.