ఏపీ అధికార పార్టీ వైసీపీకి తత్వం బోధ పడిందా? ఎన్నికలకు ముందు మరిన్ని ప్రయోగాలు చేయాలని అనుకున్న పార్టీ అధినేత సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీ లకులు. నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చే ఉద్దేశం లేదని తాజాగా సీఎం జగన్ ప్రకటించారు. వాస్తవానికి.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇంకా మార్పులు ఉంటాయని.. ప్రస్తుతం నియమించిన ఇంచార్జ్లు అభ్యర్థులు కారని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.
అయితే.. అనూహ్యంగా సీఎం జగన్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరిద్దరు తప్ప ఎవరినీ మార్చే పరిస్థితి లేదని, ఆయన చెప్పారు. కాబట్టి అందరూ కలిసి మెలిసి చేసుకో వాలని అన్నారు. సో.. దీనిని బట్టి వైసీపీలో ఇప్పుడు ఇంచార్జ్లుగా నియమితులైన వారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉండడనున్నారు. అయితే.. ఇలా యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? అనేది చూస్తే.. క్షేత్రస్థాయిలో పార్టీలో రగులుతున్న రాజకీయమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే నియమితులైన అభ్యర్థులకు.. స్థానిక కేడర్ సహకరించడం లేదనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికలు సమీపిస్తున్నా ఇటీవల నియమితులైన అభ్యర్థులు/ఇంచార్జుల హడావుడే తప్ప ఇతర నేతల జోష్ కనిపించడం లేదు. మరోవైపు.. టికెట్లు రాని వారు కూడా పార్టీలో యాక్టివ్ లేకుండా పోయారు. ఈ పరిణామాలను గమనించిన జగన్ యూటర్న్ తీసుకుని ఎవరినీ మార్చేదిలేదన్నారు. ఇక్కడ ఇంకో రీజన్ కూడా కనిపిస్తోంది.
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడం, దీనికి బీజేపీ కూడా కలిసి వస్తే.. మరింత గట్టిగా క్షేత్రస్థాయిలో వైసీపీకి డ్యామేజీ ఏర్పడుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఇప్పుడున్న వారిని మార్చి మరింత సెగలు, పొగలు కక్కేలా పరిస్థితి మార్చుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అదేసమయంలో ఉన్నవారిలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తే.. బెటర్ అని ఆయన భావించి ఉంటారు. అందుకే చివరి నిముషంలో మార్చాలని అనుకున్నా.. మౌనంగా ఉండిపోయారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.