తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండా సమీపంలో లారీ, ఆర్ టీ సీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా పలువురు వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వ్యవసాయ పనులకు ఆటోలో కూలీలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు అందరూ ఇజ్రా చిట్టెంపల్లి తండాకు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన అయిదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంతో తండాలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.
ఏపిలోని చిత్తూరు జిల్లాలో వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తెలంగాణలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. వాహనాల అతివేగమే ఈ ప్రమాదాలకు కారణమని భావిస్తున్నారు.