హైదరాబాద్, ఏప్రిల్ 13: డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటి గ్రిడ్స్ సంస్థకు ఉచ్చు బిగుసుకొంటోంది. తాజాగా ఆధార్ చట్టం సెక్షన్ లపైనా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గత నెలలో మాదాపూర్ హైటెక్ సిటిలో ఉన్న ఐటి గ్రిడ్స్ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆధార్, ఓటరు లిస్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తదితర వ్యక్తిగత వివరాలు ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్ కు సేవలు అందిస్తోంది. ఈ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సంస్థ ఎండి అశోక్ పరారీలో ఉన్నాడు.
ఈ సంస్థ కార్యాలయంలో ఆధార్ సమాచారం లభించడంతో అదెలా వచ్చిందో తెలియజేయాలని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వివరణ కోరుతూ ఢిల్లి లోని ఆధార్ కేంద్రం అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన యూఐడిఏఐ అధికారులు హైదరాబాద్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆధార్ కార్డు చట్టంలోని సెక్షన్ 37, 38, 40, 42, 44 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు.