ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో వైరస్ను కట్టడి చేసేందుకు అటు ప్రభుత్వాలు ,ఇటు అన్ని శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోన నివారణ మందుల తయారీ, వ్యాక్సిన్ కోసం అన్ని దేశాల శాస్త్రవేత్తలు ఎంతో కృషిచేస్తున్నారు.
రోజు రోజుకు కరోన వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదే అదునుగా చేసుకోన్నీ కొందరు మాయగాళ్ళు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలో కొత్తగా కరోనా ట్యాగ్లు మార్కెట్లోకి వచ్చాయి. వైరస్ నివారిణుల పేరుతో వీటిని మందుల దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూశాయి వెలుగు చూశాయి. ఈ ట్యాగ్ లను మెడలో వేసుకుంటే కరోనా వైరస్ దరిచేరదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇంకేముంది ట్యాగ్ల మార్కెట్ కాస్తా ఊపందుకుంది. అమాయకులైన ప్రజలు మందుల దుకాణాలలో వివిధ పేర్లతో అమ్మకాలు చేస్తున్న ట్యాగ్లను కొనుగోలు చేస్తున్నారు.
ఫలితంగా ట్యాగ్ ల వ్యాపారం మూడు ఫులూ ,ఆరు కాయలుగా మారింది. తమ దుకాణాల వద్దకు వచ్చే వారికి వ్యాపారులు సైతం అంటగడుతున్నారు. చైనా, జపాన్ దేశాల్లో తయారైనట్టు చెబుతున్న వీటిని విజయవాడ నుంచి తెచ్చి ఇక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. వీటి ఖరీదు ఒక్కొక్కటీ సుమారు రూ.150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది. వైరస్ ఉద్ధృతితో భయాందోళనలకు గురవుతున్న పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు.చివరకు కొందరు అధికారులు కూడా వీటిని మెడలో వేసుకుని ఉండటం గమనార్హం.
కాగా ట్యాగ్ ల పనితనం పై వైద్యులను అరా తీయగా ..వైద్యులు మాత్రం ఈ ట్యాగ్లు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. మాస్కులు ధరించి.. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండటం ద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చు అని చెబుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు.అలాగే ఈ ట్యాగులు వలన కరోనా రాకుండా పోదు అన్నది సారాంశం .