ఏపిలో పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో జరిగింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. ఓ పక్క ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు జరగకూడదనే పట్టుదలతో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కాకపోతే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ముక్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరో పక్క అసెంబ్లీలోనూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇలా తీర్మానం చేయడం రాజ్యంగ విరుద్ధమంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల గవర్నర్ కు లేఖ కూడా రాశారు. ప్రభుత్వం నుండి ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దని, అవసరమైతే సుప్రీం న్యాయనిపుణులను సంప్రదించాలనీ నిమ్మగడ్డ కోరారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ ఎస్ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎకపక్షంగా ప్రకటన చేశారని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని అన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే ఆరు వేల మందికిపైగా మృతి చెందారనీ, ఈ తరుణంలో ప్రభుత్వానికి ప్రజారోగ్యం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం నేడు తాజాగా తీర్పు వెల్లడించింది.
ఇటీవల కేరళలోనూ ఇటువంటి అంశమే జరిగింది. ఓ వ్యక్తి కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు విచారణ జరిపి ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై సదరు వ్యక్తి హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని లేకుంటే కొట్టివేస్తామని సుప్రీం కోర్టు పేర్కొనడంతో పిటిషనర్ తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.