Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. తొలుత కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది.
రాష్ట ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం (బీఆర్ఎస్) విఫలమైందని ఆరోపించింది. కేసిఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే .. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదని, రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.
అనంతరం సభలో తీర్మనం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. ఏపీకి నీటి తరలింపునకు నాటి సీఎం కేసిఆర్ ఏ విధంగా సహకరించారనే విషయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కృష్ణాజలాలను ఏపీకి ధారాదత్తం చేశారని ఉత్తమ్ అన్నారు.
కేసిఆర్, జగన్ లు అనేక సార్లు ప్రగతి భవన్ లో కలుసుకున్నారనీ, బిర్యానీ తిని కృష్ణానీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. ఎంత నీటిని తరలించారో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్, కేసిఆర్ లు ఏకాంత చర్చలు జరిపి నీటిని ఏపీకి తరలించుకుపోయారని అన్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కేసిఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రదర్శించిన జగన్ ప్రసంగ వీడియో హైలెట్ గా నిలిచింది. కేసిఆర్ వల్లనే ఏపీకి నీళ్లు విడుదల అయ్యాయని జగన్ అంటూ ధన్యవాదులు తెలియజేస్తూ మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. అప్పుడు ఉదారంగా నీళ్లు విడుదల చేసి ఇప్పుడు అసత్యాలు మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ పై అధికార పక్షం విమర్శలు గుప్పించింది.