తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు పాల్గొనడంతో తిరుపతి వీధులు జనసంద్రంగా మారాయి. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీలేదన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధాని కావాలని జగన్ ఎప్పుడూ చెప్పలేదనీ, అమరావతిని సమర్ధించలేదని భూమన అన్నారు.
అమరావతి శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం వస్తే ఆయన వెళ్ల లేదని భూమన గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని శాసనసభలో ఆనాడు జగన్ చెప్పారన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మాణం సరైనదని జగన్ చెప్పారని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కు తాము వ్యతిరేకమని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారని భూమన అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తాము ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలును న్యాయరాజధానిగా చేయడం ద్వారానే మరింత ప్రగతి సాధించవచ్చని అన్నారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, వైసీపీ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
రాజధానిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో ముందడుగు