కోల్కతా, మార్చి 10 : నకిలీ కరెన్సీని గుర్తించే స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను ఐఐటి-ఖరగ్పూర్ విద్యార్థులు ఆవిష్కరించారు. జాతీయస్థాయి ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2019’ లో ఈ ఆవిష్కరణను ప్రదర్శించినట్టు ఐఐటి ఖరగ్ పూర్ ఒక ప్రకటనలో తెలిపింది.
కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆరుగురు విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేశారు. టి.వై.ఎస్.ఎస్ సంతోష్, సతీష్ కుమార్ రెడ్డి , విపుల్ తోమర్, సాయి కృష్ణ, ద్రిష్టి తుల్సి , డి.వి.సాయిసూర్య ఈ బృందంలో ఉన్నారు.
ఫోన్ ద్వారా కరెన్సీని స్కాన్ చేస్తే అది నకిలీ నోటా, కాదా అన్నది తేలిపోతుందని వీరు తెలిపారు.
‘అప్లికేషన్ను డౌన్ లోడ్ చేసుకున్న యూజర్.. తాము ఏ నోటును అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ నోటు ఇమేజ్ను అప్ లోడ్ చేయాలి. దాన్ని అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. ఒరిజినల్ నోటులో ఉండాల్సిన 25 అంశాలను బేరీజు వేసుకుని చెక్ చేస్తుంది. ఒకవేళ అది నకిలీ నోటు అయితే, వెంటనే యూజర్ను అలర్ట్ చేస్తుంది. ఈ నోటులో ఫలానా చోట తప్పు ఉందని సూచిస్తుంది’ అని అప్లికేషన్ పనితీరును వీరు వివరించారు.