విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ముందే డిసైడ్ అయిందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పోటీ చేశారు. అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత బొండా ఉమా ఆ పార్టీ టికెట్పై పోటీ చేశారు. ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు తీవ్రంగానే సాగింది. చివరకు రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేని విధంగా మల్లాది కేవలం 25 ఓట్ల తేడాతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ సమీకరణ కూడా మారిపోయింది.
మల్లాది స్తానంలో వెస్ట్ ఎమ్మెల్యే వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ను పార్టీ రంగంలోకి దింపింది. ఇది వైసీపీ భారీ పరీక్షా కాలమేనని చెప్పాలి. మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి కనీసం ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు(ఆయన నియోజకవర్గాన్ని ఆనుకునే ఉన్నప్పటికీ). కనీసం.. ఇక్కడి ఆలయాల్లో వసతుల ఏర్పాటుకు అనేక డిమాండ్లు వచ్చినా.. ఆయన పట్టించుకోలేదు. దీనికితోడు.. బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఆయనపై వ్యతిరేకత ఉంది. మంత్రివర్గంలో ఉన్నప్పుడు.. ఆయన దుర్గగుడి బ్రాహ్మణులను అవమానించారని పెద్ద రగడ చోటు చేసుకుంది. దీనిని బ్రాహ్మణ సంఘాలు నిరసించాయి కూడా.
దీనికి తోడు సెంట్రల్ నియోజకవర్గంలో ఏకంగా 40 వేల బ్రాహ్మణుల ఓటింగ్ ఉంది. వెల్లంపల్లి సామాజిక వర్గం అయిన వైశ్యులు పశ్చిమలోనే ఉన్నారు. అక్కడ కాదని వెల్లంపల్లి సెంట్రల్కు వచ్చినా ఇక్కడ సమీకరణలు ఆయనకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ వెల్లంపల్లికి మైనస్ అవుతున్నాయి. మల్లాది తనను కాదని.. పొరుగు ఎమ్మెల్యేను ఇక్కడ పెట్టడంతో అంతర్గతంగా రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం నచ్చజెప్పినా.. పైపైన మాత్రమే ఆయన నటిస్తున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. తన వర్గాన్ని వెల్లంపల్లికి అనుకూలంగా వ్యవహరించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో వెల్లంపల్లి ప్రజల మధ్యకు వచ్చేందుకు వెస్ట్లోని తన అనుచరులు తీసుకుని సెంట్రల్కు వస్తున్నారు.
మరోవైపునియోజకర్గాలనికి వెల్లంపల్లి కొత్తకావడం.. చంద్రబాబు సహా జనసేనపై గతంలో తీవ్ర విమర్శ లు చేసిన దరిమిలా సెంట్రల్లోని మాస్ జనాల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఉన్న కాపు వర్గం ఓటర్లు కూడా వెల్లంపల్లిని అస్సలు ఇష్టపడడం లేదు. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే సహకారం లోపించడం.. కేడర్ లేకపోవడం.. టీడీపీ బలంగా ఉండడం.. తను కొత్త కావడం వంటివి వెల్లంపల్లికి మైనస్లుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు.. గత ఎన్నికల్లో మల్లాది గెలిచేందుకు తాము ఎంతో ఖర్చు చేశామని.. ఆడబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని.. కాబట్టి మీరైనాభర్తీ చేయాలని.. ఆయనపై వైసీపీ కార్పొరేటర్లు 11 మంది ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వెల్లంపల్లికి ఊపిరాడడం లేదని వైసీపీ నాయకులే చెబుతున్నారు.
అటు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఐదేళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉండడం కూడా ప్లస్ కానుంది. ఇవన్నీ ఈ సారి వెల్లంపల్లి గెలుపు అంత సలువు కాదని సిగ్నల్స్గా కనిపిస్తున్నాయి.