తనపై జరుగుతున్న దాడిని రాజకీయంగా, సాంకేతికంగా ఎదుర్కునేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారా?
కరోనా సంక్షోభంలో ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎదుర్కోవడంలో కొత్త గేమ్ ప్లాన్కు తెర తీశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, ఎందరినో కలచి వేసింది. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కన్ను మూసిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున అందించనున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ మేరకు అందించారు.
ఐదు ఆస్పత్రులకు షాక్….
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు తీసుకుంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేపించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో విజయవాడలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ తో పాటుగా ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ కు చెందిన ఐరా హోటల్ ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య హోటల్ సన్ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు.
హైకోర్టు కామెంట్లతో ఆలోచనలో పడ్డ జగన్ సర్కారు?
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో తన అరెస్ట్పై స్టే ఇవ్వాలని కోరుతూ డాక్టర్ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏంటి? అని ప్రశ్నించింది. ఏళ్ల తరబడి హోటల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. ఈ సెంటర్లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్వో కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఒకరకంగా ఈ కామెంట్లు ఏపీ సర్కారును ఇబ్బందుల్లో పడేశాయి.
టార్గెట్ కమ్మ కులం?
కమ్మ కులం వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో అదే రూపంలో ఎదురు దాడి చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని రూపంలో స్పందింప చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేవలం కమ్మ వారి గురించే ఆలోచిస్తారని కొడాలి నాని మండిపడ్డారు. అదికూడా ఆయనకు కావలసిన కమ్మవారి గురించే ఆలోచిస్తారని… చంద్రబాబు నాయుడు కమ్మసంఘం అధ్యక్షుడు అవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వారి విషయంలో నానా యాగీ చేసే బాబు కమ్మ వారి విషయంలో వెనకేసుకురావడం సరి కాదని కొడాలి నాని అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని అన్నారు. అయితే, ఈ కామెంట్లను కేవలం మాటల రూపంలో కాకుండా ఆచరణలో చూపించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు.