విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు జలమయం అవుతున్నాయి. భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో గోదావరి నది పొంగిపొర్లుతోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల ఫలితంగా వరదలతో ఏపీలో భారీ నష్టం జరిగింది.
వందలాది గ్రామాలు నీటిమునిగి పోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందించిందని అంటున్నారు.
అప్పుడు జగన్ ఏం చేశారంటే….
వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా సీఎం జగన్ పరిశీలించారు. ఏరియల్ సర్వేలో.. పంటపొలాలన్నీ నీట మునిగిపోయి.. లోతట్టు గ్రామాలన్నీ జల దిగ్బంధంతో చిక్కుకుపోవడం.. ఇళ్లు నీటిలో మునిగిపోవడం చూసి సీఎం జగన్ చలించిపోయారు. ముంపునకు గురైన ప్రాంతాలు.. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
సీరియస్గా స్పందించిన సీఎం జగన్….
మరోవైపు.. పెద్ద ఎత్తున వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజల గురించి ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఏరియల్ సర్వేకు ముందు రాజమండ్రి విమానాశ్రయంలో గోదావరి జిల్లాల నేతలు కలిసిన సీఎంకు ముంపు ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి జగన్ తక్షణ స్పందన, బాధితులకు అండగా నిలిచి తీరు నేపథ్యంలో విపక్షాలకు ఎంత మాత్రం చాన్సివ్వకుండా ముందుకు సాగుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
6000 మందిని జగన్ సర్కారు…..
తూర్పుగోదావరి జిల్లాలో 14 మండలాలపై వరద ప్రభావం పడింది. దేవీపట్నం మండలంలో 36 గ్రామాల్లో మూడువేలకు పైగా ఇళ్లను గోదావరి వరద ముంచెత్తింది. తూర్పు మన్యంలోని 88 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసర సరుకులు, వరద బాధితుల తరలింపు కోసం 14 లాంచీలు, 86 బోట్లు పనిచేస్తున్నాయి. వరద బాధితులకు సహాయక చర్యల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని ఇప్పటికే సీఎం జగన్ జిల్లా అధికారులను ఆదేశించారు. కోవిడ్ను కూడా దృషిలో ఉంచుకుని సహాయ శిబిరాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 68 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరువేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
ధవళేశ్వరం వద్ద….
కాగా, వరద వల్ల గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు. ధవళేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏపీ విపత్తుల శాఖ సహాయక బృందాలను రంగంలోకి దించింది. అనేక గ్రామాల్లోకి వరద చొచ్చుకుని రావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల్లోని అధికారులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స కోసం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.