వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేర్పులు ఎంపిక నేపథ్యంలో తమ పార్టీ నేతలతో బంతాట ఆడుకుంటున్నారు. అసలు వైసీపీలో కొత్త సమన్వయకర్తల ఎంపికలో ఏం ?జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇటీవల సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నియమించిన వాళ్ళు కేవలం సమన్వయకర్తలు మాత్రమే.. అభ్యర్థులు కాదు అని చెప్పారు. ఆ వెంటనే పార్టీ శ్రేణులతో సీఎం జగన్ మాట్లాడుతూ సమన్వయకర్తలే రేపటి అభ్యర్థులు అని ప్రకటించారు.
ఇప్పటివరకు జగన్ 9 జాబితాలలో నియోజకవర్గ సమన్వయకర్తలను ప్రకటించారు. పదే పదే మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడుసార్లు అభ్యర్థులను మార్చేస్తున్నారు. సర్వేల పేరిట ఆశావాహులతో వైసిపి అధిష్టానం బంతి ఆట ఆడుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసి డమ్మీలను చేసింది. వారి నియోజకవర్గాలను కూడా మార్చేస్తూ ఆట ఆడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ – మద్దిశెట్టి వేణుగోపాల్ – టీజేఆర్ సుధాకర్ బాబును పక్కనపెట్టినా ఎవరు నోరు మెదపడం లేదు.
బుర్రా మధుసూదన్ యాదవ్ జగన్ ను బతిమిలాడుకోవడంతో చివరికి ఆయనకు తొమ్మిదో జాబితాలో కందుకూరు సీటు ఇచ్చారు. ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలలో కొత్త సమన్వయకర్తలుగా తాటిపర్తి చంద్రశేఖర్ – దద్దాల నారాయణ యాదవ్ ఎంపికయ్యారు. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో ఇన్చార్జిలను ఇటు అటు మార్చారు. దర్శి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించారు. ఒక్క ఒంగోలు అసెంబ్లీ సీటు తప్ప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్తలను నియమించింది.
మంత్రులు ఆదిమూలపు సురేష్ – మేరుగు నాగార్జున కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో రెండు నెలలకు పైగా పరిస్థితిని చక్కబెట్టుకునే పనిలో ఉన్న వారికి స్థానిక కేడర్ నుంచి ఎలాంటి సహకారం లేదు. నారాయణ యాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్ గత కొన్నాళ్లుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా వారిది అదే పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని పోటీకి దూరంగా ఉంటానని చెప్పిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మార్కాపురం సీటు ఇచ్చారు. ఇక మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కి గిద్దలూరులో పరిస్థితి ఎంత మాత్రం అనుకూలంగా లేదు. అయినా ఆయన అధిష్టానానికి ఎదురు చెప్పే సాహసం చేయలేక సర్దుకుపోతున్నారు.
వైకాపా కొత్త సమన్వయకర్తలను ఎంపిక చేసిన అన్ని నియోజకవర్గాల్లోను తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొండపిలో మంత్రి సురేష్కు మాజీ ఇంచార్జ్ మాదాసి వెంకయ్య వర్గం సహకరించడం లేదు. ఇదేనే నియోజకవర్గంలో వరికుటి అశోక్ బాబు వర్గం కూడా సురేష్ కు సహకరించటం లేదు. కనిగిరిలో నారాయణ యాదవ్కు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వర్గాలు దూరంగా ఉన్నాయి. గిద్దలూరులో నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా లోకల్ కేడర్ ఒంగోలు కేంద్రంగా మంత్రాంగం నడుపుతున్నారు. దర్శిలో బూచేపల్లికి సెట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం దూరంగానే ఉంది. సంతనూతలపాడులో మంత్రి నాగార్జున తమను అసలు పట్టించుకోవడం లేదంటూ స్థానిక నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు.