ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ మూడు రాజధానుల ఏర్పాటు. ఒక రాజధాని బదులుగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోంది.
మరోవైపు రాజధాని భూములపై సిట్ విచారణ జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన నివేదిక విడుదలైంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కొత్త డౌట్లు వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత నేడు యనమల రామకృష్ణుడు తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు.
అన్నింటా ఫెయిలయిన జగన్…
తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజధాని అమరావతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నిందారోపణలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కరోనా వైరస్ నియంత్రణలో సీఎం జగన్ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. దాడులు, దౌర్జన్యాలతో దళితులు, గిరిజనులకు దూరమైన వైసీపీ ప్రభుత్వం బీసీలపై, ముస్లిం మైనారిటిలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్కు మీటర్లు పెట్టే దురాలోచనలతో రైతుల్లో వ్యతిరేకత మహిళలపై అత్యాచారాలు, యువతకు ఉపాధి లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. రాజధాని 3ముక్కలాట వంటి తుగ్లక్ చర్యలతో రాష్ట్రం అప్రదిష్టపాలు అయిందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపెట్టేందుకే తెలుగుదేశంపై జగన్ మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
జగన్ పెద్ద తప్పు చేశారట
ఏడాదిన్నర అవుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు లేకపోవడం శోచనీయమని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల తన కర్తవ్యాన్ని విస్మరించి ప్రత్యర్ధులపై ప్రతీకారమే లక్ష్యంగా పని చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఐదేళ్ల పాలనపై కేబినెట్ సబ్ కమిటి నియమించిన చరిత్ర ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆ కమిటి నివేదిక ఆధారంగా సిట్ నియమించడం మరో తప్పిదమని తప్పుపట్టారు. ఈ రెండింటి ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్లో ఉందని తెలిపారు. కోర్టులో పెండింగ్ ఉన్న అంశంపై నివేదిక బైటపెట్టడం ధిక్కారమేనని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
అప్పుడు అలా…ఇప్పుడు ఇలా?
సబ్ కమిటి ఏర్పాటు, సిట్ నియామకమే తప్పిదాలనే అంశం కోర్టులో ఉన్నప్పుడు వాటి నివేదికలను ఎలా బైటపెడతారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. “కేవలం చంద్రబాబుపై వ్యక్తిగతంగా, టీడీపీపై రాజకీయంగా ఉన్న కక్షతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలి పోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన తన అవినీతిని బైటపెట్టారనే అక్కసుతోనే జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారు.“ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. “రాజధాని నిర్ణయం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి నివేదిక ప్రకారం జరిగింది. 2014-19 అసెంబ్లీలో ఉన్న అన్నిపార్టీల ఏకాభిప్రాయం మేరకే జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమరావతిని స్వాగతించారు, 33వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ది చేయాలని సూచించారు. అన్ని పార్టీల ఆమోదం మేరకే అప్పట్లో రాజధాని ఎంపిక జరిగింది. 5ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజధాని సరిహద్దుల నిర్ణయంలో అవకతవకలు జరిగాయని చెప్పడం జగన్ కక్ష సాధింపులో భాగమే.“ అని యనమల మండిపడ్డారు.
బాబు బ్యాచ్ బాధ ఇదేనా?
ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “సబ్ కమిటిలో ఉన్నది జగన్ అనుచరులే, సిట్ లో ఉన్నది జగన్ ప్రభావితులే. కాబట్టి జగన్ చెప్పిందే సబ్ కమిటి ఇస్తుంది, సిట్ పేర్కొంటుంది. అందుకే ఈ రెండింటి ఏర్పాటును టీడీపీ వ్యతిరేకించింది. ఇప్పుడా విషయం న్యాయస్థానాల్లో పెండింగ్ ఉంది. ఇలాంటి సందర్భంలో నివేదికలు బైటపెట్టడం కోర్టు ధిక్కరణే“ అని ఆసక్తికర కామెంట్లు చేశారు. అయితే, టీడీపీ అవినీతి బయటపడిందనే కోర్టు ధిక్కారణ టీడీపీ గగ్గోలు చెందుతోందని చర్చ జరుగుతోంది.