వైసీపీలో సమన్వయకర్తల నియామకాలు ఆషామాషీగా జరిగిపోతున్నాయి. జగన్ కు ఎప్పుడు ఎవరు గుర్తుకు వస్తే వారిని సమన్వయక ర్తలుగా నియమించేస్తున్నారు.. ఆయనకు నచ్చకపోతే ఎవరిని అయినా పక్కన పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్లు.. మంత్రులుగా ఉన్న వారినే జగన్ సింపుల్ గా పక్కకు నెట్టేస్తోన్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది సీటీలు చించేసిన జగన్ ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు సీటు చించేసేందుకు సిద్ధమవుతోన్న పరిస్థితి.
అంబటి రాంబాబు వైఎస్ ఫ్యామిలీకి భక్తుడు. వైఎస్సార్ మరణాంతరం నుంచి జగన్ పెట్టిన వైసీపీలోనే కొనసాగుతున్నారు. చాలా రోజుల తర్వాత జగన్ ఆయనకు 2014లో సత్తెనపల్లి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అంబటి దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో అంబటికి సీటు వస్తుందా ? రాదా ?అన్న సందేహాలు ఉన్నాయి. అంబటి జగన్ ను బతిమిలాడుకోవడంతో మరోసారి ఆయనకు సత్తెనపల్లి సీటు ఇవ్వగా.. అంబటి గట్టెక్కారు.
1989 తర్వాత ఆయన ఏళ్లకు అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత ప్రక్షాళనలో జగన్ ఆయనకు ఏకంగా ఇరిగేషన్ మంత్రి పదవి కట్టబెట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై రెచ్చిపోతూ జగన్ కు వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. కట్ చేస్తే మళ్లీ అంబటి ఈ సారి కూడా సత్తెనపల్లి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే జగన్ ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు. ఇప్పటికే అంబటి సోదరుడిని పొన్నూరు ఇన్చార్జ్ గా నియమించారు.
ఇక అంబటిని కూడా సత్తెనపల్లి నుంచి తప్పించే ప్లాన్ రెడీ అయ్యిందట. గుంటూరు పార్లమెంటు సీటు విషయానికి వస్తే ప్రస్తుతం పోన్నూరు ఎమ్మెల్యే గా ఉన్న కిలారి రోశయ్యను ఖరారు చేశారు. రోశయ్య కూడా ఇంకా పూర్తి స్థాయిగా చురుగ్గా ప్రచారంలోకి దిగలేదు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయనింకా పూర్తిగా కనెక్ట్ కాలేదు కూడా.. ! అయితే ఇంతలోనే రోశయ్య ను తప్పించేస్తున్నట్టు తెలుస్తోంది. రోశయ్యను పక్కన పెట్టేసి ఆ ప్లేస్ లో అంబటి రాంబాబును గుంటూరు ఎంపీగా పోటీ చేయిస్తారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి మోదుగుల వేణు గోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
ఇక గుంటూరు వైసీపీలో మార్పులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ సీటు ఆశించిన మేయర్ కావటి మనోహర్ నాయుడ్ని ఇప్పుడు మూడు నెలల తరువాత చిలకలూరిపేటకు మార్చారు. విచిత్రం ఏంటంటే పేట నుంచి మంత్రి విడదల రజనీని గుంటూరుకు తీసుకు వచ్చి.. గుంటూరు కు చెందిన మనోహర్ నాయుడిని పేటకు పంపారు. సహజంగా రాజకీయాల్లో నేను లోకల్ అనే నినాదం గెలిచే వారిని చూశామని కానీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్పులు జరగడం మరీ కామెడీ అయిపోయింది.