వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆరు జాబితాల్లో పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మార్చేశారు. 30కు పైగా ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వగా.. మిగిలిన వాళ్లకు స్థానచలనం చేశారు. ఒకరిని ఒక చోట నుంచి మరో చోటకు మార్చుకుంటూ వస్తున్నారు. ఈ మార్పులు చేర్పులు చాలా మందికి అర్థం కావడం లేదు. అసలు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వెంటనే వైసీపీలో చేరిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లకే ఈ సారి సీటు వస్తుందా ? రాదా ? అన్నది డౌట్గా ఉంది.
కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినా కూడా జగన్ పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ గత ఎన్నికల్లో 41 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి ఆయనపై అక్కడ స్థానికంగా పార్టీ కేడర్లో యాంటీ ఉండడంతో మార్పులు, చేర్పుల్లో భాగంగా ఆయన్ను తప్పించేసి అదే నియోజకవర్గంలోని హనుమంతునిపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్కు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
కట్ చేస్తే ఇప్పుడు బుర్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక టైంలో పార్టీ మారిపోతారన్న ప్రచారమూ జరిగింది. బుర్రా ఎవరో కాదు కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్కు స్వయానా వియ్యంకుడు కావడం విశేషం. ఇప్పటికే సారథి వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే మధు కూడా పార్టీ మారిపోతారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా జగన్ను కలిసిన మధుసూదన్ తనకు కనిగిరిలో కాకపోయినా మరోచోట పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ను రిక్వెస్ట్ చేశారు.
మధు 2014లో కనిగిరిలో ఓడిపోయి గత ఎన్నికల్లో గెలిచారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం కమిట్మెంట్తో ఉండడంతో కందుకూరు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని సిగ్నల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మానుగుంట మహీధర్రెడ్డి ఉన్నారు. ఆయన్ను తప్పించిన జగన్ పక్కనే కొండపి నియోజకవర్గానికి చెందిన బోట్ల రామారావు యాదవ్ను ఇన్చార్జ్గా ఇవ్వగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళుతున్నారు.
ఇదే టైంలో బోట్ల రామారావును కాదని.. ఇప్పుడు అదే బీసీ కమ్యూనిటీకి చెందిన బుర్రా మధుసూదన్ను అక్కడకు పంపే ప్లాన్లో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరో చోట రీ ప్లేస్ చేశారు. ఇప్పుడు మధు అన్నా ఎక్కడైనా పోటీ చేస్తా అని జగన్ను వేడుకోవడంతో ఆయన విషయంలోనూ అదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బోట్ల రామారావుకు షాక్ తప్పదు.