విశాఖలో శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో మంత్రులు ఆర్ కే రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
విశాఖ పర్యటనకు విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ నుండి తిరుగు ప్రయాణం అయ్యేందుకు మంత్రులు, వైసీపీ నేతలు ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన జన సేన కార్యకర్తలకు వైసీపీ నేతల కార్లు కనబడటంతో కర్రలతో దాడికి దిగారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రుల కాన్వాయ్ పై దాడి చేసిన వారిని సీసీ కెమెరాలతో పోలీసులు గుర్తిస్తున్నారు.
మంత్రుల కాన్వాయ్ పై జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రి గుడివాడ అమరనాథ్ తీవ్రంగా ఖండించారు. దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారు జనసైనికులు కాదు జన సైకోలు అంటూ అభివర్ణించారు మంత్రి అమరనాథ్. ప్రజాస్వామ్యంలో దాడులకు పాల్పడటం మంచిపద్దతా అని ప్రశ్నించారు. జనసైనికుల దాడిని పలువురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. జనసేన కార్యకర్తల దాడిలో తమ వారికి కొందరికి గాయాలు అయ్యాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. తమతో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగలేరనీ ఇది మంచిపద్దతి కాదని ఆయన హెచ్చరించారు.
Visakha Garjana: జనసంద్రమైన విశాఖ వీధులు .. జోరు వర్షంలోనూ గర్జన ర్యాలీ