(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎనిమిది వారాల్లో నివేదికను ధర్మాసనానికి అందజేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఇటీవల న్యాయమూర్తులను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు ఏపి ప్రభుత్వం సహకరించాలని ధర్మాసనం సూచించింది.
ఇంతకు ముందు విచారణ సందర్భంలో ఈ వ్యవహారంలో పోలీసుల వైఖరిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఎంపి నందిగం సురేష్ తదితరులు హైకోర్టు తీర్పులను తప్పుబడుతూ న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు రిజిస్టార్ నుండి ఫిర్యాదు వెళ్లినా సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల పట్ల అసభ్యంగా మాట్లాడిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసు వైఖరి ఇదే విధంగా కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అయితే దీనిపై సీబీఐకి కేసు అప్పగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనిపై సోమవారం విచారణ సందర్భంలో హైకోర్టు..సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.