(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఇప్పటి వరకూ వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ కనకదుర్గమ్మ వారధి ప్రారంభోత్సవం రేపు (16వ తేదీ) జరుగనున్నది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు రేపు ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అయిన తరువాత మొదటగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి శంకర నారాయణ, అధికారులు ఫ్లైఓవర్పై వాహనాల్లో ప్రయాణించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ తో పాటు రూ.15.592 కోట్ల అంచనాతో 61 కొత్త ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
తొలుత ఈ ఫ్లైఓవర్ను గత నెల 4వ తేదీన ప్రారంభించాలని భావించారు. అయితే ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని సూచించింది. దీంతో వారధి ప్రారంభోత్సవం సెప్టెంబర్ 18వ తేదీకి వాయిదా పడింది. కానీ ఈ ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ప్రారంభోత్సవం వాయిదా పడినా ప్రజల అవసరాల దృష్ట్యా 18వ తేదీ నుండి ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారని విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని ప్రకటించినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫ్లైఓవర్పై వాహనాలను ఎప్పటి నుండి అనుమతి ఇచ్చేది ఆర్ అండ్ బి అధికారులు వెల్లడిస్తారని నాడు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలియజేశారు. చివరకు ముచ్చటగా మూడవ సారి ప్రారంభోత్సవ మూహూర్తం అక్టోబర్ 16వ తేదీకి ఫిక్స్ అయ్యింది.
కొన్ని దశాబ్దాలుగా విజయవాడ నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చేసే వాహనచోదకులు దుర్గగుడి సమీపంలో ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు. ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడం, రేపు ప్రారంభోత్సవం జరుగనుండటంతో ఎట్టకేలకు వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ క్రెడిట్ను దక్కించుకోవాలని విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని, మరో పక్క వైసీపీ ప్రభుత్వం చూస్తున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంపి కేశినేని నాని ప్రత్యేక శ్రద్ద, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది లోపు పూర్తి చేశారు. దీంతో ప్లైఓవర్ నిర్మాణ క్రెడిట్ తమదే అని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.