దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఏప్రిల్ వరకు మొత్తం నమోదైన కేసులతో పరిశీలిస్తే..మే మొదటి రెండు వారాల్లోనే 121 శాతం మేర కేసులు పెరిగాయి.
రోజుకు 3 వేలకు పైగా కేసులు
మే 1వ తేదీ నాటికి 35 వేలు ఉన్న కేసుల సంఖ్య 12వ తేదీ నాటికి డబుల్ అయింది. ఈ నెల 1వ తేదీ నుండి నిన్నటి వరకు సగటున రోజుకు 3135 చొప్పున కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది.
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు, సొంత ప్రాంతాలకు వలస కార్మికుల తరలింపు తదితర కారణాల వల్ల రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 78 వేలు దాటింది. 2,551 మంది మృత్యువాత పడ్డారు. 26,414 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 49 వేల మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 3,722 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్ లో పేర్కొన్నది. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ తో 134 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,003 కు చేరింది.
దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర అల్లాడిపోతుండగా గుజరాత్, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. ఇప్పటి వరకు 1142 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. 47 మంది వైరస్ తో మృత్యువాత పడగా 948 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలోనే కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది.
ఇక తెలంగాణాలో కొత్తగా 41 కేసులు నమోదు కాగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ నుండే 31 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 10 మంది వలస కూలీలు. ఇప్పటి వరకు తెలంగాణాలో 1367 పాజిటివ్ కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 34కి చేరింది. బుధవారం 117 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 939 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 394 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.