అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలింపు నేపథ్యంలో వివిధ వ్యాపార వర్గాలకు ఊరట కల్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం గురువారం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది.
కంటైన్మెంట్, బఫర్జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్కు అనుమతి లేదని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, వస్త్ర, చెప్పుల దుకాణాలకు కూడా అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దుకాణాల వద్ద విధిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 24వ తేదీ నుండి ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పెట్టకపోయినా దేశ, రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి కుదేలు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తున్నది.