దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ ఇప్పటికీ పోస్టుమార్టం నిర్వహించుకుంటోంది. తాజాగా ఈ ఓటమి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంతటి ప్రచారానికైనా ఒడిగడుతుందని కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా తన మేనల్లుడు మంత్రి హరీశ్ రావు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ గురించి నిప్పులు
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ చేయని దుష్ప్రచారం, ఆడని అబద్ధం లేదని కేసీఆర్ మండిపడ్డారు. “టీఆర్ఎస్ అభ్యర్థి పోలింగ్ బూతులోకి వెళ్లి, బ్యాలెట్ పేపర్ మీద హరీశ్ రావు ఫోటోలేదని అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆమెను ఆగౌరవ పరుస్తూ పోస్టింగులు పెట్టారు. ఇంత దుర్మార్గం ఉంటదా? ఇంత నీచమైన ప్రచారం చేస్తారా? ఇంతకు మించిన ఘోరమైన పాపం ఉంటదా? జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా ఇలాంటి దారుణాలే చేయాలని చూస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టాలి’’ అని కేసీఆర్ కోరారు.
అగ్గిమండే హైదరాబాద్….
హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఆలవాలమయిన ప్రాంతం అని కేసీఆర్ పేర్కొన్నారు. “అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నారు. చేతగాని నేతల వల్ల కొన్ని సార్లు మత కల్లోలాలు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో హైదరాబాద్ ప్రశాంతంగా నిద్రపోతోంది. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నగరానికి పెట్టబడులు తరలి వస్తున్నాయి. అమెజాన్ కంపెనీ ఒక్కటే 21 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మొత్తంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా? అగ్గిమండే హైదరాబాద్ కావాలా? మత కల్లోలాల హైదరాబాద్ కావాలా? మత సామరస్యం వెల్లివిరిసే హైదరాబాద్ కావాలా? మతం పేర కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా? అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండే హైదరాబాద్ కావాలా? హైదరాబాద్ నగరంలో అభివృద్ది కావాలా? అశాంతి రాజ్యమేలాలా? ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.