సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ రాజకీయం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు తోడుగా ఎదురవుతున్న పరిస్థితులు సైతం చర్చకు దారి తీస్తున్నాయి.
ముఖ్యంగా ఎంతో ఆశతో కుదుర్చుకున్న బీజేపీతో పొత్తు ఎత్తుగడతో జనసేనకు ఏం ప్రయోజనం దక్కుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం కోసం జనసేనాని పడుతున్న తాపత్రయం అందరికీ అర్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా అన్న అంశంపై క్లారిటీ రావడం లేదు. మరోవైపు బీజేపీ తీరు చర్చకు ఆస్కారం ఇస్తోంది.
పవన్కు బీజేపీ షాకులు మామూలుగా లేవుగా
పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ ఇస్తున్న షాకులు మామూలుగా లేవంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించిన జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రచారంలోకి దింపే సమయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనికి బీజేపీయే కారణం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేందుకు కమిటైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… అనంతరం హడావుడిగా నాదెండ్లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. దాదాపు రెండు రోజుల పాటు కేంద్ర బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం వేచి చూశారు. తిరుపతిలో పోటీ చేసేది తామేనని ఈ మధ్యలోనే బీజేపీ రాష్ట్ర నేతలు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ.. ఎక్కడో ఉండిపోయిన చిన్న ఆశతో జేపీ నడ్డాను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తరువాత.. పవన్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆశించిన హామీ దొరకలేదనే అర్ధం అవుతోంది.
హైదరాబాద్ గల్లీలో … ఢిల్లీలో రెండింట పవన్కు షాకే
జేపీ నడ్డా పిలిస్తేనే ఢిల్లీ వచ్చామని పవన్కల్యాణ్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు అమరావతి, పోలవరంపై కూడా చర్చించామని చెప్పారు. భవిష్యత్లో ఏపీలో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైనా చర్చించినట్లు చెప్పారు.
నడ్డాతో జరిగిన భేటీలో తిరుపతి బైపోల్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడామని పవన్ చెప్పారు. అయితే, అభ్యర్ధి ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తిరుపతిలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే దానిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు. పోటీలో నిలిచేది బీజేపీనా, జనసేననా అనేది రెండ్రోజుల్లో తేలిపోతుందని జనసేనాని స్టేట్ మెంట్ ఇచ్చారు.
పవన్ ఆరాటం … బీజేపీతో పోరాటం
తిరుపతి సీటు విషయంలో బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు బలంగా ఉండాలంటే… తమ పార్టీకి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ చాన్స్ తక్కువని అంటున్నారు.