గుంటూరు: ఎస్సి వర్గీకరణ గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన తీరు బాధాకరమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. 24గంటల వ్యవధిలో ఏ అసెంబ్లీలో ఆ మాటలు అన్నారో మళ్ళీ అదే అసెంబ్లీలో ఎస్సి వర్గీకరణపై ఆయన వైఖరి తెలియచేయాలనీ లేకుంటే 48 గంటల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.
జగన్ పరిపాలన తీరుపై ఆరు నెలలు వరకు స్పందించ కూడదని అనుకున్నాం కానీ స్పందించాల్సిన ఆవసరం ఏర్పడిందని కృష్ణమాదిగ అన్నారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్, చంద్రబాబు కన్నా సామాజిక వర్గ పరంగా జగన్ మంత్రివర్గ కూర్పు అభినందనీయమని మంద అన్నారు.
జగన్కు తెలంగాణలో ఓదార్పు యాత్రకు ఎంఆర్పిఎస్ అండగా నిలిచిందనీ, జగన్ రైతు, ప్రత్యేక హోదా దీక్షలకు మద్దతు తెలిపామని మందా చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంచి పాలన అందించారని కితాబు ఇస్తూనే విభజన తర్వాత చంద్రబాబు మాదిగలను మోసం చేశారని మంద ఆరోపించారు.
చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయనను మాదిగలు విశ్వసించరని కృష్ణ మాదిగ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీకరణకు మద్దతు ఇచ్చి సమర్ధించారని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణ విషయంలో జగన్ తన తండ్రి ఆశయ సాధన దిశగా ఆడుగులు వేయాలని కృష్ణమాదిగ కోరారు.
నాడు వైఎస్ నాయకత్వంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి మద్దతు తెలిపారనీ, ఎస్సి వర్గీకరణ కోసం వైఎస్ కేంద్రానికి లేఖలు కూడా రాశారని కృష్ణమాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సి వర్గీకరణ చేయటం అంటే దళితులలో చీలిక తీసుకురావటం అని మాట్లాడటం బాధాకరమని కృష్ణమాదిగ అన్నారు. జగన్ కూడా కడప ఎంపిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానికి వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశారనీ, ఇప్పుడు తన వైఖరి ఎందుకు మారిందనీ కృష్ణమాదిగ ప్రశ్నించారు.